PRABANJANAM
Date of Publish : 08 August 2026, 10:34 am Posted by : Prabanjanam News

నడిరోడ్డుపై నిలిచిన 108 అంబులెన్స్..

నడిరోడ్డుపై నిలిచిన 108 అంబులెన్స్..

ఇబ్బందుల్లో వృద్ధురాలు

రాజన్న సిరిసిల్ల: ( ప్రభంజనం )

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ వాహనం సాంకేతిక లోపంతో నడిరోడ్డుపై ఆగిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గాయపడిన వృద్ధురాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాకు చెందిన భూక్య జెమిలి (85) అనే వృద్ధురాలు ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి కాలికి తీవ్ర గాయామైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించడంతో, అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని వృద్ధురాలను ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు.
మార్గమధ్యలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకోగానే, అంబులెన్స్ ఒక్కసారిగా రోడ్డుపైనే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా వాహనం స్టార్ట్ కాకపోవడంతో.. కాలి గాయంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న వృద్ధురాలను మరో అంబులెన్స్ వచ్చే వరకు అదే వాహనంలో కూర్చోబెట్టారు. అత్యవసర సేవలందించాల్సిన 108 వాహనం ఇలా మధ్యలోనే నిలిచిపోతుండటం పట్ల స్థానికులు, వృద్ధురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర వాహనాల నిర్వహణ (మెయింటెనెన్స్) సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.