PRABANJANAM
Date of Publish : 10 August 2026, 3:45 pm Posted by : Prabanjanam News

వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి.. పరారీలో ఆర్ఎంపీ డాక్టర్ 

  • వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ..
  • పరారీలో వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టర్ 
  • ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన

ఖమ్మం జిల్లా (ప్రభంజనం): ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురైన 8వ తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానిక ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ అనంతరం బాలికకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడి పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బస్వాపురంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు బాలికకు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలికను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహించి బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, చికిత్స అందించే సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన అనంతరం ఆర్ఎంపీ వైద్యుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.