- అంజయ్య నగర్ లో ఘటన
శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )
హాస్టల్ భవనం పై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కల్లూరి సుబ్బారావు (38) కొంతకాలంగా అంజయ్య నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో హాస్టల్ భవనం పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీస్స్టేషన్ ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హాస్టల్ యాజమాన్యాన్ని విచారించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. హత్య, ఆత్మహత్య కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.