- ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో వైభవంగా రంగం
హైదరాబాద్ : ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో సోమవారం రంగం (భవిష్యవాణి) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు జంగం మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు నగరం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా మాతంగి స్వరూపిణి కె. అనురాధ పచ్చి భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి నివేదనతో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు పచ్చగా విలసిల్లుతాయని ఆమె జోస్యం చెప్పారు. ఉప్పుగూడ మహంకాళి ఆలయ ప్రాంగణంలో పవిత్ర మరకత శివలింగం ప్రతిష్ఠాపన జరగడం పట్ల అమ్మవారు ఎంతో సంతోషంగా ఉన్నారని భక్తులకు స్ఫష్టం చేశారు.
యువత సన్మార్గంలో నడవాలి
ప్రస్తుత సమాజంలో యువత చెడు అలవాట్లకు బానిసలై దారి తప్పుతున్నారని భవిష్యవాణిలో అమ్మవారు ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాలు, యువతరం మంచి మార్గంలో నడవాలంటే చిన్నతనం నుంచే భక్తిశ్రద్ధలను అలవర్చుకోవాలని, అమ్మవారిని నిష్కల్మషమైన మనసుతో కొలవాలని సూచించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.