PRABANJANAM
Date of Publish : 15 August 2026, 11:51 am Posted by : Prabanjanam News

జేఎన్‌టీయూహెచ్‌లో అంతర్గత రాజకీయాలపై ఆందోళన..సీ‌ఎస్‌ఈ విభాగాధిపతి మెసేజ్ కలకలం

  • సీ‌ఎస్‌ఈ విభాగాధిపతి బాధ్యతల నుంచి డా. శాంతిశ్రీ వైదొలగడం చర్చనీయాంశం
  • ‘అసూయ, చౌకబారు రాజకీయాలే కారణం’ అంటూ విద్యార్థులకు సందేశం..

హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌లో విద్యా ప్రమాణాల కంటే అంతర్గత వ్యవహారాలు, రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) విభాగాధిపతిగా ఉన్న డా. శాంతిశ్రీ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు విద్యార్థులకు పంపిన సందేశం చర్చనీయాంశంగా మారింది.తన నిర్ణయానికి ‘అసూయ, చౌకబారు రాజకీయాలు’ కారణమని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. విద్యా వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధ్యాపకురాలు ఇలాంటి కారణాలను ప్రస్తావిస్తూ పదవి నుంచి తప్పుకోవడం విశ్వవిద్యాలయ వర్గాల్లో ఆందోళనకు దారితీస్తోంది.ఈ వ్యవహారంపై జేఎన్‌టీయూహెచ్‌ ఉన్నతాధికారులు పారదర్శకంగా స్పందించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని విద్యార్థులు, అధ్యాపక వర్గాలు కోరుతున్నాయి. విశ్వవిద్యాలయంలో ఆరోగ్యకరమైన విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు అంతర్గత విభేదాలకు పరిష్కారం చూపాలని వారు అభిప్రాయపడుతున్నారు.