హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలకు సరికొత్త స్వాతంత్ర్య దినోత్సవ కానుకను అందించింది. పాత, చిరిగిపోయే పేపర్ కార్డుల స్థానంలో దేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ల్యామినేటెడ్ పీవీసీ (PVC) స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని నేడు అధికారికంగా ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలతో ముద్రితమైన ఈ స్మార్ట్ కార్డులను, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని 33 జిల్లాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏకకాలంలో పంపిణీ చేస్తున్నారు.
క్యూఆర్ కోడ్తో భద్రత.. డూప్లికేట్ కార్డులకు బ్రేక్
పౌరసరఫరాల వ్యవస్థలో (PDS) మరింత పారదర్శకతను పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డెబిట్/ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ సరికొత్త కార్డులపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ (QR Code), లబ్ధిదారుల పూర్తి వివరాలు, ఈ-కేవైసీ (e-KYC) సమాచారం పొందుపరిచారు. దీనివల్ల నకిలీ కార్డుల వినియోగానికి పూర్తిగా బ్రేక్ పడనుంది. జూలై 31 నాటికి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ ప్రాధాన్యత క్రమంలో ఈ కార్డులను అందజేస్తున్నారు.
3.42 కోట్ల మందికి ప్రయోజనం.. నెలకు 6 కిలోల సన్నబియ్యం
రాష్ట్రంలోని సుమారు 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల పరిధిలో ఉన్న 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ సరికొత్త కార్డుల ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రతి నెలా 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది.
3.42 కోట్ల మందికి ప్రయోజనం.. నెలకు 6 కిలోల సన్నబియ్యం
రాష్ట్రంలోని సుమారు 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల పరిధిలో ఉన్న 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ సరికొత్త కార్డుల ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రతి నెలా 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది.రాబోయే 15 రోజుల్లో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పదేళ్ల తర్వాత రేషన్ కార్డుల వ్యవస్థలో వచ్చిన ఈ పెను మార్పుపై లబ్ధిదారుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.