PRABANJANAM
Date of Publish : 21 August 2026, 1:30 pm Posted by : Prabanjanam News

ప్రాణాలు తీశాడు..ఫ్లైట్ ఎక్కించి పంపాడు.. జనసేన రాజ్యసభ ఎంపీ కుమారుడి దారుణం

  • ఈనెల 16న అతివేగంతో సేల్స్ గర్ల్ ను ఢీకొట్టిన ఎంపీ సుపుత్రుడు
  • ఆస్పత్రికి తీసుకెల్లేలోపు బాధితురాలు మృతి
  • మూడురోజులు కనబడకుండా పోయిన కారు
  • మృతదేహాన్ని ఫ్లైట్ లో ఓడిశాకు పంపిన ఎంపీ అనుచరులు
  • ఈనెల16న మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
  • ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు సంజూష్ పై కేసు

సిటీ క్రైమ్ (ప్రభంజనం):మాదాపూర్‌లో ఈ నెల 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజూష్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇన్‌ఆర్బిట్‌ మాల్‌ ఉద్యోగిని భారతి ముఖి (26) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఆగస్టు 16న ప్రమాదం

పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి భారతి ముఖి ( 26) మాదాపూర్‌లోని ఇన్‌ఆర్బిట్‌ మాల్‌లో లైఫ్‌స్టైల్‌ స్టోర్‌లో సేల్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఆమె తన సహోద్యోగి పూజా అశోక్‌ అలొన్‌తో కలిసి ఐటీసీ కోహినూర్‌ సమీపంలో భోజనం తీసుకురావడానికి వెళ్లారు. తిరిగి మాల్‌కు వస్తుండగా మాల్‌కు ఎదురుగా రోడ్డు దాటుతున్న సమయంలో ఆస్టన్‌ మార్టిన్‌ కారు( టీజీ-09-జీ-0666) ఢీకొట్టినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రమాదంలో భారతి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెను అదే కారులో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. ప్రమాదం గురించి సహోద్యోగి పూజా స్టోర్‌ మేనేజర్‌ పంజాల అశ్విన్‌ కుమార్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఆసుపత్రికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంజూష్‌పై బీఎన్ ఎస్ 106(1) కింద కేసు

పోలీసులు సంజూష్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్ )లోని సెక్షన్‌ 106(1) కింద కేసు నమోదు చేశారు.ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కారు అధిక వేగంతో, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌ ఏసీపీ సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇప్పటివరకు సంజూష్‌ను అరెస్ట్‌ చేయలేదు. నేరం బెయిలబుల్‌ కావడం, శిక్ష ఏడేళ్లలోపు ఉండటంతో నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన ఆస్టన్‌ మార్టిన్‌ కారు టీజీ-09-జీ-0666 వాహనం హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ ఎల్ పీ పేరుతో రిజిస్టర్‌ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కారు ప్రమాదం జరిగిన తర్వాత మూడు రోజులైనా పోలీసులు సీజ్ చేయలేదన్న ఆరోపణలు వినిపించాయి. శుక్రవారం మధ్యాహ్నం కారును సీజ్ చేసినట్లు మాదాపూర్ సీఐ వీడియో రిలీజ్ చేశారు.

 

ఫ్లైట్ లో ఒడిషాకు మృతదేహం..

రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ప్రాణాలు కోల్పోయిన భారతి ముఖి పోస్ట్ మార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పిలిపించిన ఎంపీ లింగమనేని అనుచరులు భారతి ముఖి మృతదేహాన్ని స్పెషల్ ఫ్లైట్ లో ఒడిశాలోని ఆమె ఇంటికి చేర్చారని సమాచారం. ఇవేమీ బయటకు పొక్కకుండా ఎంపీ అనుచరులు మృతురాలి బంధువులతో మాట్లాడి క్లియర్ చేశారని, కేసు విషయంలోనూ ఎంపీ అనుచరులు జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిందితుడికి బ్రీత్ అనలైజ్ టెస్ట్..

ర్యాష్ డ్రైవింగ్ తో యువతి ప్రాణాలు తీసిన నిందితుడు లింగమనేని సంజూష్ కు పోలీసులు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చిందని, అలాగే డ్రగ్స్ టెస్ట్ కోసం బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపినట్లు సమాచారం.