PRABANJANAM
Date of Publish : 06 August 2026, 6:39 pm Posted by : Prabanjanam News

సీరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్…రూ.12 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

  • పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు  
  • రూ. 12 లక్షల విలువైన 80 గ్రాముల బంగారం స్వాధీనం 

క్రైమ్ బ్యూరో ( ప్రభంజనం ) : వివిధ కమిషనరేట్ల పరిధిలో వరుసగా ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌జిల్లా నేరస్థులతో పాటు ఒక చోరీ సొత్తు గ్రహీతను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసు కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు దేరంగుల హరిబాబు (21) అలియాస్ నాని గత జూన్ 2026లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన్నీరు సూర్య( 22) నరాల రాహుల్‌ (21)లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి మళ్లీ వరుస ఇళ్ల దొంగతనాలకు తెరలేపాడు. నిందితుడు హరిబాబుపై గతంలో 27 కేసులు, సూర్యపై 13 కేసులు, రాహుల్‌పై 3 కేసులు నమోదు కాగా, వీరిపై పాత నేర చరిత్ర ఉంది.ఈ ముఠా ఇటీవల గౌరారం, సంగారెడ్డి టౌన్, పోచారం ఐటీ కారిడార్, నాగోల్, కుషాయిగూడ, మేడిపల్లి, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 11 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వీరి వద్ద నుండి రూ. 12 లక్షల విలువైన 80 గ్రాముల బంగారం, 258 గ్రాముల వెండి, 4 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, నేరానికి ఉపయోగించిన ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. యాదేందర్, జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ డి. రవి రాజ్, వారి సిబ్బంది అత్యంత ప్రతిభావంతంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారని కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డిసిపి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు.