PRABANJANAM
Date of Publish : 08 August 2026, 11:02 pm Posted by : Prabanjanam News

మియాపూర్ జీఎస్ఎం మాల్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలుడు..

  • ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు..
  • ఐస్క్రీమ్ బండి నిర్వాహకుడి పరిస్థితి విషమం
  • బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుండగా ప్రమాదం

శేరిలింగంపల్లి,( ప్రభంజనం):మియాపూర్‌లోని జీఎస్ఎం మాల్ సమీపంలో బెలూన్లలో గ్యాస్ నింపేందుకు ఉపయోగించే చిన్న సిలిండర్ పేలడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఐస్క్రీమ్ బండి నిర్వహిస్తున్న ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఓ కాలేజీ విద్యార్థిని, ఓ ఐటీ ఉద్యోగిని కూడా ఉన్నారని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పేలుడుకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్‌లో గ్యాస్ నింపే సమయంలో ప్రమాదం జరిగిందా? లేక సిలిండర్‌లో సాంకేతిక లోపం కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.