మల్లాపూర్,(ప్రభంజనం): మదర్ మీరా హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ తిమోతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించడంతోపాటు దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రాధాన్యాన్ని తెలియజేశారు.
600 మంది పేద విద్యార్థులకు చేయూత
సాప్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లోని రెండు పాఠశాలలను ఎంపిక చేసుకుని సుమారు 600 మంది పేద విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలో మరో పాఠశాలను ఎంపిక చేసి అక్కడి పేద విద్యార్థులకు కూడా తమ వంతు సహాయం అందిస్తామని పేర్కొన్నారు. విద్యతోనే పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తిమోతి, సాప్స్ ఫౌండేషన్ నిర్వాహకుడు కిరణ్, రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.