PRABANJANAM
Date of Publish : 15 August 2026, 9:32 am Posted by : Prabanjanam News

ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ప్రభుత్వం ఉండొద్దు :కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

  • పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదు.. పేదల కోసం పని చేయాలి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్

చౌటుప్పల్‌, ప్రభంజనం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వాన్ని తాను విమర్శించడం లేదని చెప్పారు. అయితే నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నానని తెలిపారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్‌ కార్యకర్తలను అణచివేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావించారు. “సీమాంధ్ర పాలకుల మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం నడవకూడదు.. తెలంగాణ ఆత్మగౌరవంతోనే ప్రజాపాలన సాగాలి” అని అన్నారు. ప్రభుత్వ పాలన పేదల కోసం ఉండాలని.. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మరోసారి తేల్చిచెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మొత్తంగా.. పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.