PRABANJANAM
Date of Publish : 01 September 2026, 4:12 pm Posted by : Prabanjanam News

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కొడుకు హిట్‌ అండ్‌ రన్‌..రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన

  • ఒకరు మృతి, విద్యార్థికి తీవ్ర గాయాలు

సిటీ క్రైమ్ ( ప్రభంజనం ): రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఓఆర్‌ఆర్‌ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసుల వివరాల ప్రకారం.. నందులాల్‌ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన మహీంద్రా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నందులాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించేందుకు విద్యార్థి జైద్‌షా కద్రీ ప్రయత్నిస్తున్న సమయంలో అదే కారు వారిని కూడా ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో నందులాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా, విద్యార్థి జైద్‌షా కద్రీ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు మహీంద్రా కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కారు నడిపింది ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అనంతరం సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.