PRABANJANAM
Date of Publish : 13 July 2026, 11:18 pm Posted by : Prabanjanam News

ఏఐ వాడకంలో భారత్ నెం.1.. ప్రపంచంలోనే మన ఉద్యోగులు టాప్!

  • ఏఐ వాడకంలో భారత ఉద్యోగులు ప్రపంచంలోనే అగ్రస్థానం
  • 80 శాతం మంది వారానికి చాలాసార్లు ఏఐ వినియోగిస్తున్నట్టు వెల్లడి
  • పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఏఐ వాడుతున్నట్టు నివేదికలో వెల్లడి
  • ఏఐ వినియోగం పెరిగినా, ఉత్పాదకతపై ఉద్యోగుల్లో సందేహాలు
  • భారత ఉద్యోగులు టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నారని ఏడీసీ ప్రశంస
కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో భారత ఉద్యోగులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారని ఏడీపీ అనే సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 80 శాతం మంది ఉద్యోగులు వారంలో చాలాసార్లు ఏఐని వాడుతుండగా, 41 శాతం మంది ప్రతిరోజూ వినియోగిస్తున్నారని సోమవారం విడుదలైన ఈ రిపోర్ట్ పేర్కొంది.

రాబోయే ఏడాదిలో ఏఐ తమ ఉద్యోగ బాధ్యతలపై సానుకూల ప్రభావం చూపుతుందని 31 శాతం మంది ఉద్యోగులు బలమైన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ఆశావాద దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే, ఆసక్తికరంగా ఏఐని తరచుగా వాడే ఉద్యోగులే తమ ఉత్పాదకతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఏఐ వాడని వారితో పోలిస్తే, ఏఐ వాడేవారిలో ఒత్తిడి తక్కువగా ఉన్నప్పటికీ ఈ ధోరణి కనిపించడం గమనార్హం.

ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో యువత ముందుంది. 18–39 ఏళ్ల వయసు వారిలో 43 శాతం మంది దాదాపు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తున్నారు. అలాగే, పురుషుల (40 శాతం) కంటే మహిళలే (44 శాతం) ఎక్కువగా ఏఐని వాడుతున్నట్టు తేలింది. పెద్ద సంస్థల్లో ఈ వినియోగం మరింత ఎక్కువగా, సుమారు 54 శాతంగా ఉంది.