ఇద్దరి ప్రాణాలు బలిగొన్న అతివేగం
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన
గచ్చిబౌలి, ఆగస్టు 8: ( ప్రభంజనం )
అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్) సర్వీస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి 12.25 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24) నగరానికి వలసవచ్చి కొల్లూరులోని ఇంద్రారెడ్డి నగర్లో నివాసం ఉంటూ టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరిద్దరూ శనివారం అర్ధరాత్రి ఇంద్రారెడ్డినగర్ నుంచి నానక్రామ్గూడలోని సత్వాకు (ఏపీ01ఏబీ2232 ) టవేరా కారులో బయలుదేరారు. కనైయాలాల్ కారు నడుపుతుండగా.. డంపింగ్ యార్డు, నియో పోలీస్ బ్రిడ్జి సమీపంలోని ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్డులో వాహనం అదుపుతప్పింది. దీంతో బ్రిడ్జి పిల్లర్ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న కనైయాలాల్, దేరామ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.