- పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు: శంకర్ గౌడ్
శేరిలింగంపల్లి ( ప్రభంజనం): జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ బాలుడికి ఆపద్బాంధవుడిలా నిలిచారు శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన నేత, బీసీ యువసేన జాతీయ అధ్యక్షులు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి. కూకట్పల్లి సీబీసీఐడీ కాలనీలో జరిగిన ఈ వేడుకల్లో కాలేయ మార్పిడి వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న బాలుడి వైద్యం కోసం రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమురి శంకర్ గౌడ్ చేతుల మీదుగా ఈ చెక్కును బాలుడి తండ్రికి అందజేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని మురళి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అనంతరం నేమురి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు 2029లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేసి, ఇక్కడి నుంచి గెలిచే ఎమ్మెల్యేలను పవన్ కల్యాణ్కు బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్నారని, కేవలం రెండేళ్ల కాలంలోనే ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా జనసైనికులందరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు యువకులు నేమురి శంకర్ గౌడ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.