PRABANJANAM
Date of Publish : 20 August 2026, 6:11 pm Posted by : Prabanjanam News

Jinnaram : నిబంధనల ఉచ్చులో.. మంబాపూర్ అభివృద్ధి..!

  • రహదారి విస్తరణ, వీధి దీపాల పనులకు అటవీశాఖ అడ్డంకులు
  • అటవీశాఖ ఆంక్షలతో నిలిచిన రోడ్డు వెడల్పు పనులు
జిన్నారం: వివిధ ప్రభుత్వ శాఖల నిబంధనలు గ్రామాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారాయని మంబాపూర్ సర్పంచ్ కొత్తకొండ భాస్కర్ ఆరోపించారు. గుమ్మడిదల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఉమాదేవి ఆధ్వర్యంలో, మండల ప్రత్యేక అధికారి అఖిలేష్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంబాపూర్ గ్రామంలో ఎదురవుతున్న రహదారి, విద్యుత్ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్తూ అధికారులను నిలదీశారు.గ్రామానికి ఉన్న ప్రధాన రహదారిని విస్తరించేందుకు ప్రయత్నిస్తుంటే.. అటవీశాఖ అధికారులు నిబంధనల పేరుతో పనులను అడ్డుకుంటున్నారని సర్పంచ్ సభలో వివరించారు. ఇదే క్రమంలో గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు కూడా అటవీశాఖ నుంచి తీవ్ర సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
కాలిపోతున్న బోరు మోటర్లు..
గ్రామ పరిధిలోని ఫార్మ్‌ల్యాండ్‌లకు గ్రామం నుంచే విద్యుత్ సరఫరా చేస్తుండటంతో స్థానికంగా వోల్టేజీ సమస్య తలెత్తుతోందని సర్పంచ్ తెలిపారు. ఫార్మ్‌ల్యాండ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల రైతుల వ్యవసాయ బోరు మోటర్లు పూర్తిగా కాలిపోతున్నాయని, దీనివల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలు నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించకుండా సమన్వయంతో వ్యవహరించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి మంబాపూర్ రహదారి వెడల్పుతో పాటు నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.