PRABANJANAM
Date of Publish : 04 September 2026, 5:28 am Posted by : Prabanjanam News

JNTU student fight: జేఎన్టీయూలో ఘర్షణ.. హాస్టల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తత

కూకట్ పల్లి (ప్రభంజనం): కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంజీరా, గౌతమి హాస్టళ్ల విద్యార్థుల మధ్య జరిగిన ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గత రాత్రి తీజ్ పండుగ వేడుకల సమయంలో ఒక విద్యార్థిపై కొందరు వర్సిటీ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది. క్రమంగా అది ముదిరి, మంజీరా హాస్టల్ లోపల విద్యార్థులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. వివాదం అక్కడితో ఆగకుండా, యూనివర్సిటీ గేటు బయటకు వెళ్లే క్రమంలో కర్రలతో దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘర్షణలో గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు, జేఎన్టీయూ గేటు ముందు బయటి నుంచి విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.