- అధికారుల నిర్ణయాలపై విద్యార్థుల అసంతృప్తి
తెలంగాణ బ్యూరో (ప్రభంజనం): జేఎన్టీయూ వసతి గృహాల కేటాయింపు విషయంలో ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత నెలలో వసతి గృహాల్లో గదులు సరిపోవడం లేదంటూ అధికారులు పేర్కొనగా, మంజీర వసతి గృహంలోని కింది అంతస్తును ఐదో సంవత్సరం విద్యార్థులకు కేటాయించారు. అయితే ప్రస్తుతం మళ్లీ ఐదో సంవత్సరం విద్యార్థుల్లో వసతి గృహం అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మూడో సంవత్సరం విద్యార్థులు కింది అంతస్తులో ఉండాలంటే దరఖాస్తు చేసుకోవడంతో పాటు విశ్వవిద్యాలయ హెల్త్ సెంటర్ నుంచి మెడికల్ రిపోర్ట్ తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఒకే వసతి గృహానికి సంబంధించి తరచూ మారుతున్న నిబంధనలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
గతంలోనే అధికారులు 90 మంది విద్యార్థులకు 45 గదులు సరిపోతాయని, మిగిలిన సుమారు 35 గదులు ఖాళీగా ఉండే అవకాశం ఉందని విద్యార్థుల తరఫున ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదని వారు పేర్కొంటున్నారు. అవసరానికి మించి గదులు ఖాళీగా ఉంచుతూ, మరోవైపు విద్యార్థులకు వసతి సౌకర్యం లేదని చెప్పడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయాల్లో స్పష్టత, పారదర్శకత పాటించాలని విద్యార్థులు కోరుతున్నారు. నిబంధనలు తరచూ మార్చడం, ఒకే అంశంపై భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో అయోమయం ఏర్పడుతోందని చెబుతున్నారు.
గురువులు, ఉన్నతాధికారుల వ్యవహారశైలి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. నిర్ణయాల్లో స్పష్టత లేకపోతే విద్యార్థులు అధికారులను ఎలా గౌరవించాలి? అంటూ కొందరు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
వసతి గృహాల కేటాయింపుపై పూర్తి వివరాలను వెల్లడించి, ఖాళీగా ఉన్న గదులను వినియోగంలోకి తీసుకువచ్చి విద్యార్థుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.