- ఏజెన్సీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన
- ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ ప్రతినిధుల డిమాండ్

ఉస్మానియా యూనివర్సిటీ: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లలో ప్రభుత్వం జీవో నంబర్ 49ను అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. జీవో 49ను వర్తింపజేయకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగ ప్రతినిధులు మాట్లాడారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్ 49ను అమలు చేసేలా నోటిఫికేషన్లో తగిన సవరణలు చేయాలని వారు కోరారు. ఈ జీవో అమలు కాకపోతే ఏజెన్సీ ప్రాంతాల అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఏజెన్సీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నప్పటికీ, ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు) ఇప్పటికీ స్పందించకపోవడం అత్యంత బాధాకరమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని, జీవో 49 అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.