PRABANJANAM
Date of Publish : 28 July 2026, 4:43 pm Posted by : Prabanjanam News

జెన్-జీ నిరసనకారులపై కంగనా ఫైర్.. తీవ్ర వ్యాఖ్యలతో దుమారం

  • నీట్ నిరసనల్లో పాల్గొన్న జెన్-జీ విద్యార్థులపై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు
  • వారి వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని పోస్ట్
  • కంగనా క్షమాపణ చెప్పాలంటూ విపక్ష నేతల డిమాండ్
ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై ఇటీవల జరిగిన నిరసనలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు “వాంతి” వచ్చేలా ఉన్నాయంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన పోస్ట్‌లు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా నిరసనల్లో పాల్గొన్న యువతులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

కంగనా తన పోస్ట్‌లో, “నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనలకు సంబంధించిన రీల్స్ చూస్తుంటే వాంతి వస్తోంది. వారి మాట తీరు, ఉపయోగిస్తున్న భాష అత్యంత దారుణంగా ఉన్నాయి. వీరిని అసలు ఎవరు కని పెంచుతున్నారు?” అని ప్రశ్నించారు.

నిరసనకారులు తమను తాము “బొద్దింకలు”గా అభివర్ణించుకోవడాన్ని ప్రస్తావిస్తూ, వారు ప్రపంచానికి కేవలం అసహ్యాన్ని మాత్రమే చూపుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ వీడియోల చూసిన తర్వాత తనకు ‘డిజిటల్ డిటాక్స్’ అవసరమనిపించిందని, నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద చెత్తను వదిలివెళ్లారని ఆమె ఆరోపించారు.

ముఖ్యంగా నిరసనల్లో పాల్గొన్న యువతులను ‘గట్టర్ జనరేషన్’ అని సంబోధిస్తూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “చదువులో రాణించలేని కొందరు పాశ్చాత్య మహిళలు, కనీసం గృహిణులుగా ఉండటానికి కూడా పనికిరారు. తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడుతూ డ్రగ్స్, డ్రింక్స్ తీసుకోవడాన్నే స్వేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు” అని దుయ్యబట్టారు.

కంగనా వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినుల పట్ల ఒక మహిళగా కంగనాకు కనీస సానుభూతి లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ స్పందిస్తూ, కంగనా భాష అత్యంత అభ్యంతరకరంగా ఉందని, ఆమె తక్షణమే యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన పార్టీ ఎంపీల భాషా శైలిని గమనించాలని ఆయన కోరారు.