PRABANJANAM
Date of Publish : 02 September 2026, 5:20 pm Posted by : Prabanjanam News

KPHB land auction: కేపి.హెచ్.బి లో గజం భూమి రూ.2.70 లక్షలు.. ఒకే రోజు 47 కోట్ల ఆదాయం

  • రికార్డు ధర పలికిన హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్లు
  • ఒక్కరోజే రూ.47.14 కోట్ల ఆదాయం.

కూకట్ పల్లి ( ప్రభంజనం):  కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కెపీహెచ్‌బీ కాలనీలో భూముల ధరలు మరోసారి గరిష్ట స్థాయిని తాకాయి. ఎలాంటి వివాదాలు లేకపోవడం, అన్ని రకాల వసతులతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ లభించింది. బహిరంగ వేలంలో ప్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి.కెపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం హౌసింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఒక చదరపు గజం భూమి గరిష్టంగా రూ.2.70 లక్షల ధర పలికింది.

గృహ నిర్మాణ శాఖ నుంచి ఆగస్టు 10న ఈ ప్లాట్ల వేలం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అధికారులు చదరపు గజానికి రూ.1.60 లక్షల కనీస ధర ను నిర్ధారించగా, పోటీ పడి మరీ కొనుగోలుదారులు అధిక ధరలు వెచ్చించారు.గరిష్టంగా ఒక ప్లాటు చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడుపోయింది.మరో ప్లాటు చదరపు గజం రూ.2.36 లక్షలకు కొనుగోలు చేశారు.ఇంకో రెండు ప్లాట్లు చదరపు గజం చొప్పున రూ.2.06 లక్షల ధర పలికాయి.

పూర్తి పారదర్శక విధానంలో నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోవడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు తీవ్రంగా పోటీపడ్డారు. బుధవారం నాటి ఈ వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలుగా నమోదైందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. ఈ బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు మొత్తం రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన వెల్లడించారు.