- కాంగ్రెస్ నిరంకుశ పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్.
కూకట్ పల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలు, నిరంకుశ పరిపాలనపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం శేషాద్రి నగర్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత మూడేళ్ల కాలంలో కాలయాపన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు.

కేపీహెచ్బీ పరిధిలోని వసంత్ నగర్, సర్దార్ పటేల్ నగర్, సీబీసీఐడీ, సాయి నగర్, అలాగే అల్విన్ కాలనీ తులసి నగర్ ప్రాంతాల్లో దాదాపు 50 ఏళ్లుగా ప్రజలు పట్టా భూముల్లో నివసిస్తున్నారని, వీటన్నింటినీ 22 ‘ఏ’ సెక్షన్లో ఏ ప్రాతిపదికన చేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత జనవరిలో కైతలాపూర్లో రిజిస్ట్రేషన్ కార్యాలయ శంకుస్థాపనకు వచ్చినప్పుడే 22 ‘ఏ’ ఇబ్బట్ల గురించి చెప్పినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు, అధికారుల తప్పు వల్ల జరిగిందంటూ మంత్రి క్షమాపణ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులను 22 ‘ఏ’లో చేర్చి, ముడుపులు సమర్పించుకున్న వారికి ఉపశమనం కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, దీనిపై సమగ్రంగా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.రాఘవ కన్వెన్షన్స్ పేరుతో మంత్రులు సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను పక్కనపెట్టి, చివరికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆసుపత్రులను ఇప్పుడు ప్రారంభించడం మినహా కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు, తులసీరావు తదితరులు పాల్గొన్నారు.