PRABANJANAM
Date of Publish : 25 August 2026, 12:01 pm Posted by : Prabanjanam News

Madhapur Drugs Case: మాదాపూర్‌లో 7.02 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం..సాఫ్ట్వేర్ ఉద్యోగి అరెస్ట్‌.

  • మరో నిందితుడి కోసం పోలీసుల గాలింపు

శేరిలింగంపల్లి (ప్రభంజనం): మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 23న రాత్రి మాదాపూర్‌ పోలీసులు ఇనార్బిట్‌ మాల్‌ సమీపంలో తనిఖీలు నిర్వహించి సాఫ్ట్వేర్ ఉద్యోగి షేక్‌ అమ్నహ్మద్‌ (23)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 7.02 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్‌ ఫోన్‌, కాలేజీ బ్యాగ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎండీఎంఏ విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో షేక్‌ అమ్నహ్మద్‌.. ఎండీఎంఏను మహ్మద్‌ అమీర్‌ అలియాస్ అమీర్‌ ఖాన్‌ వద్ద నుంచి సేకరించి, ఇతరులకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో అమీర్‌, రాహీల్‌తో పాటు వినియోగదారుడిగా పేర్కొన్న మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 1282/2026 కింద ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేక్‌ అమ్నహ్మద్‌ను 24.08.2026న అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.