PRABANJANAM
Date of Publish : 02 September 2026, 2:19 pm Posted by : Prabanjanam News

వైయస్సార్ వర్ధంతి రోజే… మహానేతకు ఘోర అవమానం..!

  • వైఎస్సార్ స్మృతిని విస్మరించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి
  • పోచారం కాంగ్రెస్ అధ్యక్షుడి తీరుపై వైఎస్సార్ అభిమానుల మండిపాటు

ఘట్కేసర్: (ప్రభంజనం)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అగమ్యగోచర స్థితిలో ఉన్న వేళ, వరుసగా రెండుసార్లు పార్టీకి సంపూర్ణ ప్రజాదరణ తెచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డిది. పేదల గుండెల్లో నిలిచిన ఆ మహానేత వర్ధంతి రోజే, ఆయన ఫొటో కూడా లేకుండా కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఖరిపై వైఎస్సార్ అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ స్వార్థంతో వైఎస్సార్ స్మృతిని మర్చిన నాయకులు

వైఎస్సార్ వర్ధంతి రోజున కనీసం ఆయన పటాన్ని కూడా ఉంచకుండా, కేవలం సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల పరిపాలన పేరిట జెండా ఆవిష్కరణ చేయడం, రేవంత్ రెడ్డి ఫొటోకే పాలాభిషేకం చేయడాన్ని స్థానిక శ్రేణులు తప్పుబడుతున్నాయి. పేదల జీవన ప్రమాణాలు మార్చిన 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ, రూ.2 కిలో బియ్యం, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ రుణాలు, ఉచిత ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడిని అధ్యక్షుడు తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించకపోవడం ఘోరమైన అజ్ఞానానికి నిదర్శనమని మండిపడుతున్నారు. వైఎస్సార్ చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ప్రజలు, అభిమానులు ఆయనను ఇప్పటికీ దేవుడిలా పూజిస్తున్నారని, అలాంటి నాయకుడి పట్ల స్థానిక నాయకత్వం చూపిన అలసత్వం, వైఎస్సార్‌పై నిబద్ధతతో ఉన్న లక్షలాది మంది అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది.

పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి

పార్టీ ప్రాథమిక సూత్రాలను, పార్టీకి పూర్వవైభవం తెచ్చిన మహానేతలను విస్మరించి, కేవలం వ్యక్త్యాధికార ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చిన పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడి పై పార్టీ రాష్ట్ర పెద్దలు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.