- రెండు హోటళ్లపై పోలీసుల మెరుపుదాడులు..
కూకట్ పల్లి {ప్రభంజనం}: కూకట్పల్లి పరిధిలోని ఓయో హోటళ్ల వేదికగా సాగుతున్న వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లో ఉన్న రెండు హోటళ్లపై కేపీహెచ్బీ,కూకట్పల్లి పోలీసులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక మహిళ సహా ఆరుగురు నిర్వాహకులను, ఐదుగురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యబిచారం కూపంలో మగ్గుతున్న ముగ్గురు బాధితురాళ్లను సురక్షితంగా రక్షించారు. నిందితులపై పోలీసులు పిటా, బీఎన్ఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లోని సాయి ప్యారడైజ్ ఓయో హోటల్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన నమ్మకమైన సమాచారంతో పోలీసులు తొలుత దాడి చేశారు హోటల్లోనే ఉంటూ బ్రోకర్ వ్యాపారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు దుర్గం ప్రశాంత్ (29)ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే గ్లాస్ వర్క్ చేసుకునే బాలానగర్ ఫతేనగర్కు చెందిన సాగిరి రవి (45) అనే విటుడిని పట్టుకున్నారు. అక్కడ బంధీగా ఉన్న ఓ మహిళా బాధితురాలిని రక్షించి రక్షణ కేంద్రానికి తరలించారు.
మూడో అంతస్తులో మరో దందా
అదే కాంప్లెక్స్ మూడో అంతస్తులోని వైశాయ్ కాటేజ్ ఓయో హోటల్ పై జరిపిన రెండో దాడిలో భారీ నెట్వర్క్ బయటపడింది. మియాపూర్కు చెందిన అచంట ఆమని (28) అనే మహిళ ఇక్కడ ప్రధాన నిర్వాహకురాలిగా ఉంటూ ఈ వ్యభిచార గృహాన్ని నడుపుతోంది. ఆమెకు సహకరిస్తున్న డ్రైవర్ గుండబోయిన దినేష్ (21), ప్రైవేట్ ఉద్యోగి మంగలి రాజేష్ (28), క్లీనింగ్ పనిచేసే లోడుగు ఉమేష్ చంద్ర (24)తో పాటు హోటల్ రిసెప్షనిస్ట్ శివపు రాంసాయి (25)లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిర్వాహకుడు యెల్లాగౌడ్ పోలీసుల రాకను గమనించి పరారయ్యాడు.
కస్టమర్లుగా వచ్చి పట్టుబడ్డారు
ఈ హోటల్కు కస్టమర్లుగా వచ్చిన దున్నపోతుల రాజు (కార్వాన్), ఆటో డ్రైవర్ నడమింటి బాల్రాజ్ (రాజేంద్రనగర్), క్యాబ్ డ్రైవర్ రాహుల్ మాయా వంశీ (జగద్గిరిగిట్ట), ఆటో డ్రైవర్ అక్కారం ప్రశాంత్ (అల్వాల్)లను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ స్థావరం నుండి ఇద్దరు బాధితురాళ్లను పోలీసులు కాపాడారు. పరారీలో ఉన్న యెల్లాగౌడ్ కోసం గాలిస్తున్నామని, లాడ్జీలు, హోటళ్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.