హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ఈ వేడుకలు అత్యంత ఘనంగా, ఆత్మీయంగా జరిగాయి.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఇదే వేడుకలో మంత్రి సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారి సోదరీమణులు రాఖీలు కట్టారు.
రాఖీలు కట్టించుకున్న అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆయన సోదరులు అశోక్ గౌడ్, రవిచంద్రలు తమ అక్కాచెల్లెళ్ల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు.