PRABANJANAM
Date of Publish : 27 August 2026, 6:41 pm Posted by : Prabanjanam News

Raksha Bandhan: రక్షాబంధనానికి ముందే తమ్ముడి మృతి.. పాడెపైనే రాఖీ కట్టి విలపించిన సోదరి

మహబూబాబాద్: రాఖీ పండుగ వేళ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల్లో రాఖీ కట్టాల్సిన తమ్ముడు అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ సోదరి కన్నీరుమున్నీరైంది. స్థానికుల కథనం ప్రకారం.. కురవికి చెందిన మోటపోతుల రమేష్ (30) అనే యువకుడు అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. రమేష్ మృతదేహాన్ని అంతిమయాత్రగా శ్మశాన వాటికకు తరలిస్తుండగా, దింపుడుకల్లం వద్ద అతడి అక్క తమ్ముడిని చూసి గుండెలవిసేలా రోదించింది.
“రెండు రోజులైతే రాఖీ కడదాం అనుకున్న తమ్ముడా.. ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా” అంటూ ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కన్నీళ్లను పెట్టించింది. అనంతరం కళ్లముందే జరిగిపోతున్న తమ్ముడి అంత్యక్రియల వేళ, పాడెపైనే ఉన్న తమ్ముడి చేతికి ఆమె రాఖీ కట్టి బోరున విలపించింది. ఈ కరుణాజనక దృశ్యం అంతిమయాత్రలో పాల్గొన్న బంధువులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తీవ్ర విషాద వాతావరణం మధ్య రమేష్ అంత్యక్రియలు ముగిశాయి.