- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ఓయూలో గౌడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘన నివాళులు..
- పాపన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, విగ్రహాలు ఏర్పాటు చేయాలి..
తార్నాక : ( ప్రభంజనం)
తెలంగాణ సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో గౌడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జీవన్ గౌడ్, విజయ్ గౌడ్ విశ్వం గౌడ్. ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులు, విద్యార్థులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి పోరాడిన ధీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయకుండా తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో కీలక అధ్యాయంగా గుర్తించాలని కోరారు. పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ప్రధాన కూడళ్లలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాపన్న గౌడ్ కేవలం వీరుడు మాత్రమే కాదని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన ప్రజానాయకుడని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.