బాన్సువాడ (ప్రభంజనం):బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపేట జడ్పీ హైస్కూల్లో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు మరియు బాలికల రక్షణ, భద్రతా ప్రమాణాలపై విద్యార్థులకు పలు కీలక అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు అనిల్ కుమార్, పార్వతి మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో సహాయం కోసం డయల్ 100 నంబర్కు బదులుగా 112 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను గుర్తించడం, అపరిచితుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎటువంటి సమస్య ఎదురైనా భయపడకుండా ధైర్యంగా తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.