PRABANJANAM
Date of Publish : 17 August 2026, 2:15 pm Posted by : Prabanjanam News

లఖిసరాయ్‌లో అశోక్‌ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట..

  • ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

బీహార్ : ( ప్రభంజనం )

బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రావణ మాసం సందర్భంగా అశోక్‌ధామ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో పరిస్థితి అదుపుతప్పినట్లు తెలుస్తోంది. భక్తుల ఒత్తిడికి బారికేడ్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో విద్యుత్ వైర్ తెగిపడటంతో కొందరు విద్యుదాఘాతానికి గురైనట్లు కూడా సమాచారం.
ఘటనపై పూర్తి కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, ఆలయంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.