PRABANJANAM
Date of Publish : 28 July 2026, 4:12 pm Posted by : Prabanjanam News

కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే

ప్రాచీన క్షేత్రాలు అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తాయి. ఎన్నో మహిమలకి నెలవుగా అనిపిస్తాయి. అలాంటి దివ్య క్షేత్రాల్లో ‘తిరుక్కణ్ణ పురం’ ఒకటిగా కనిపిస్తుంది. ‘కణ్వపురం’ అనే పేరుతో ఈ క్షేత్రం  దర్శనమిస్తుంది. తిరువారూరు సమీపంలో గల ఈ క్షేత్రం, పంచ కృష్ణారణ్యాలలో ఒకటిగా పేర్కొంటారు. ఇక్కడి స్వామివారు శౌరిరాజ పెరుమాళ్ పేరుతోనూ .. అమ్మవారు కన్నపుర నాయకి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

ఇక్కడి స్వామివారిని కులశేఖరాళ్వార్ .. నమ్మాళ్వార్ .. పెరియాళ్వార్ ..  ఆండాళ్ .. తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినట్టు చెబుతారు. ఇక్కడి విశేషమైన ప్రసాదాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ప్రతిరోజు రెండు కేజీల బియ్యానికి రెండు కేజీల నెయ్యిని ఉపయోగించి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారట.  కణ్వ మహర్షికి ఇక్కడి స్వామి ప్రత్యక్షమయ్యారని అంటారు. ఇక్కడి ‘నిత్య పుష్కరిణి’ని దర్శించడం వలన  సమస్త పాపలు నశించి, సకల శుభాలు చేకూరతాయని అంటారు.