PRABANJANAM
Date of Publish : 11 August 2026, 3:25 pm Posted by : Prabanjanam News

ఉజ్జయిని మహంకాళికి మారు బోనం

సికింద్రాబాద్‌: ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకున్న ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనం సమర్పించారు. బోనమెత్తిన మహిళలకు మంత్రి చీర, సారె అందజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తోందని సురేఖ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లకు ప్రజల సహకారం తోడవడంతో బోనాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు.