- అండగా నిలుస్తానని హామీ ఇస్తున్న కాంగ్రెస్ నేత
- అందరినీ చూసుకుంటానని హామీలు..
- నిర్మాణదారుడి నుండి లక్షల్లో వసూళ్లు.

కూకట్ పల్లి(ప్రభంజనం): రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవైపు అవినీతిరహిత పాలనను అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుంటే.. అదే పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు మాత్రం నిబంధనలను గాలికి వదిలేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో సాగుతున్న ఓ అక్రమ నిర్మాణం, దాని వెనుక జరుగుతున్న వసూళ్ల పర్వం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ అండతోనే ఇదంతా జరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గాలికి వదిలిన నిబంధనలు..
కేపీహెచ్బీ కాలనీలోని ఎంఐజీ 28 పరిధిలో 320 గజాల స్థలంలో శ్రీనివాసరెడ్డి పేరిట స్టిల్ ప్లస్ 5 అనుమతులు తీసుకుని, క్షేత్రస్థాయిలో మాత్రం సీఎంసీ నిబంధనలకు విరుద్ధంగా భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఏకంగా ఆరంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాకుండా కనీసం అగ్ని ప్రమాదం జరిగితే వాహనం కూడా వెళ్లలేని పరిస్థితిలో నిర్మాణాన్ని చేపట్టారు. ఎక్కడ కూడా సెట్ బాక్స్ వదలకుండా భవన నిర్మాణం చక చక జరిగిపోయింది.
హస్తం నేత ఆధిపత్యం.. లక్షల్లో వసూళ్లు
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఓ చోటా నాయకుడు కాలనీలో ఎక్కడ అక్రమ నిర్మాణం జరిగినా తనే దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. “వ్యవస్థను నేనే చక్కదిద్దుతాను, అందరినీ నేనే చూసుకుంటాను” అంటూ భవన యజమానుల నుంచి ఏకంగా లక్షల్లో వసూళ్లకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ పేరు చెప్పుకుంటూ పైరవీలు చేస్తూ సొంత జేబులు నింపుకుంటున్న ఈ తీరుపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా మండిపడుతున్నారు. పార్టీ లో నాకు ముఖ్య నాయకులు అనుకూలంగా ఉన్నారు అని పలువురి దగ్గర వాపోయడమే కాకుండా అధికారులను భయాందోళనకు గురిచేసి ముడుపులు అందిస్తున్నాడు.
అధికారుల కనుసన్నల్లోనే యథేచ్ఛగా నిర్మాణాలు.
కాలనీ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులకు అన్నీ తెలుసని స్థానికులు వాపోతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న సిబ్బంది.. ఎక్కడైనా ప్రమాదం జరిగితే తప్ప స్పందించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెడచెవిన పెడుతున్న ఫిర్యాదులు…
ప్రజావాణి, సీఎంసీ యాప్ ద్వారా అక్రమ నిర్మాణాలపై బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పైగా ఫిర్యాదు వివరాలను సదరు నిర్మాణదారులకే లీక్ చేసి వారి నుంచి మరింతగా డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముడుపులు ముడితే ఎంతటి అక్రమ నిర్మాణానికైనా అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు కేపీహెచ్బీలో బహిరంగ రహస్యంగా మారింది.
నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులైన వారిపై, వారికి సహకరిస్తున్న అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కాలనీవాసులు కోరుతున్నారు.


