హైదరాబాద్ బ్యూరో (ప్రభంజనం): జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్ హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ విగ్రహాలు, భక్తుల రాకపోకలు గణనీయంగా ఉంటాయని అంచనా వేస్తున్న కొత్తగా చేర్చిన సర్కిళ్లు, జోన్లు, కొత్తగా విలీనం చేసిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, గణేష్ ఉత్సవం 2026ను సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు చేసిన సమగ్ర ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. వినాయక చవితిని 14 సెప్టెంబర్ 2026న జరుపుకోనుండగా, గణేష్ నిమజ్జనం 25 సెప్టెంబర్ 2026న జరగనుంది.
ముందస్తు సన్నాహాల్లో భాగంగా, సమన్వయ ఏర్పాట్లను నిర్ధారించడానికి, జీహెచ్ఎంసీ అంతర్గత విభాగాలు, పోలీస్, ఫైర్, ఇరిగేషన్, ట్రాన్స్కో, ఆర్ అండ్ బీ, హెచ్ఎమ్డబ్ల్యూఎస్ఎస్బీ, హెచ్ఎమ్డీఏ, డీఎంఅండ్ హెచ్ఓ, మెట్రో రైల్, హెచ్ఆర్డీసీ, టూరిజంతో సహా అన్ని సంబంధిత లైన్ విభాగాలతో జోనల్-స్థాయి సమన్వయ సమావేశాలను నిర్వహించాలని జోనల్ కమిషనర్లందరికీ సూచించడం జరిగింది. కొత్తగా చేర్చబడిన సర్కిళ్లు, జోన్లలో కూడా ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశాలలో ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుధ్యం, లైటింగ్, విద్యుత్ సరఫరా, వైద్య సౌకర్యాలు, అత్యవసర ప్రతిస్పందన, ప్రజా భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
బాలాపూర్ గణేష్ ఊరేగింపు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉత్సవ కమిటీ, పోలీస్, అన్ని లైన్ విభాగాల భాగస్వామ్యంతో సమన్వయ ప్రణాళిక రూపొందించాలని, రోడ్లు, బారికేడింగ్, క్రేన్లు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, అత్యవసర సేవలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు.
పండుగ, నిమజ్జనం సమయంలో త్వరిత ప్రతిస్పందన కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, ట్యాంక్ బండ్ వద్ద ఒక కంట్రోల్ రూమ్తో పాటు, ప్రధాన సరస్సులు, చెరువులు, నిమజ్జన ప్రదేశాల వద్ద మొబైల్ క్రేన్లను కూడా ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు.


