- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
- పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
ఢిల్లీ: కొంపల్లి, ఉప్పల్ ఫ్లైఓవర్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బట్లు, పెరుగుతున్న రోడ్డు ప్రమాాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీల బృందంతో కలిసి దిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. ప్రధానంగా సర్వీసు రోడ్ల దుస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఫ్లైఓవర్ల నిర్మాణం ఆలస్యం కావడం వల్ల సర్వీసు రోడ్లలో గుంతలు ఏర్పడి, రోజురోజుకూ ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తక్షణమే స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. సర్వీసు రోడ్లలో గుంతలను పూడ్చి, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం పది రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎంపీలు డీకే అరుణ, మాధవనేని రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్ తదితరులు పాల్గొన్నారు.


