- జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ
- ప్రజల సహకారం కోరిన డీసీపీ కోటిరెడ్డి
కుత్బుల్లాపూర్ : మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించనున్న ఊరేగింపును ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ను డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ బాలగంగి రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం కమ్యూనిటీ పెద్దలు మరియు ఊరేగింపు నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఊరేగింపు సాగే మార్గాలు, బందోబస్తు ఏర్పాట్లు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వారితో చర్చించారు.
సమావేశం అనంతరం పోలీసులు ఊరేగింపు మార్గాలను నేరుగా పరిశీలించారు. పండుగను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు తగిన ఆదేశాలను సంబంధిత అధికారులకు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని వారు ఈ సందర్భంగా కోరారు.


