సిటీ బ్యూరో (ప్రభంజనం): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్క యశస్వి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేపట్టిన దీక్షకు మద్దతుగా పాల్గొన్న యశస్వి మాట్లాడుతూ..ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా సంవత్సరాలు పూర్తయినా ఫీజు బకాయిల కారణంగా కొన్ని కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామక పత్రాలు చేతిలో ఉన్నప్పటికీ విద్యా సర్టిఫికెట్లు సమర్పించలేక కొందరు యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టామని యశస్వి తెలిపారు. 20 లక్షల మంది మద్దతు సేకరించడమే లక్ష్యంగా ఇప్పటికే వివిధ కళాశాలల్లో సుమారు 3.5 లక్షల సంతకాలు సేకరించామని, ఈ వారాంతానికి 5 లక్షలకు పెంచుతామని వెల్లడించారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో కళాశాలలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ బాధ్యత వహించాలని యశస్వి డిమాండ్ చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపడుతున్న రెండు రోజుల నిరాహార దీక్షకు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలతో ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ నివాసం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసి, బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు పోరాటం కొనసాగుతుందని యశస్వి మల్క స్పష్టం చేశారు.


