ఘట్కేసర్ (ప్రభంజనం): మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంకటాద్రి టౌన్షిప్ లోని బాలాజీ స్వీట్ హౌస్ పై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

స్థానిక ‘బాలాజీ స్వీట్ హౌస్’లో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే సింథటిక్ రసాయన రంగులను మిఠాయిల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా రసాయనాలు కలుపుతున్నట్లు పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు.

ఈ అక్రమాలకు కారణమైన స్వీట్ హౌస్ నిర్వాహకుడు, రాజస్థాన్కు చెందిన కమల్ను పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. రసాయనాలు కలిపిన మిఠాయిల నమూనాలను ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎంతటివారైనా సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.


