- బైక్ ను ఢీకొన్న కారు,కేసు నమోదు.

శేరిలింగంపల్లి,(ప్రభంజనం): కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి వచ్చిన వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో థార్ వాహనం (ఏపీ 40 హెచ్ యూ 0555), ద్విచక్ర వాహనం ( టీజీ 32 4957)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై పిలియన్ రైడర్గా ఉన్న వనపర్తి జిల్లాకు చెందిన చెల్లా శ్రీనివాసులు (50) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న శివకుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.


