- భూపాలపల్లి మైనింగ్ ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
- 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
వరంగల్ బ్యూరో (ప్రభంజనం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) బొజ్జ జయరాజ్ నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు పలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బోడుప్పల్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా తాండూర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాలు సహా మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. భూపాలపల్లిలోని మైనింగ్ ఏడీ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. సోదాల్లో 2 కార్లు, 5ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, పలు కీలక డాక్యుమెంట్లు లభించినట్లు సమాచారం.
అక్రమాస్తుల ఆరోపణలపై దర్యాప్తు
జయరాజ్పై గతంలో ఇసుక అక్రమ రవాణా, గనుల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారితో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన సంపాదించిన ఆస్తులు, ఆస్తుల కొనుగోళ్ల పత్రాలు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో భాగంగా ఇళ్లు, కార్యాలయాల్లోని ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతర కీలక రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నగదు, బంగారం, ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు లభించాయి.
ఇటీవలే ‘ఉత్తమ అధికారి’ అవార్డు
ఈ వ్యవహారంలో మరో అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జయరాజ్కు ‘ఉత్తమ అధికారి’ అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు అందుకున్న కొద్దిరోజులకే ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు జరగడం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది.


