ప్రభంజనం డెస్క్ : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భూమి మరోసారి కపించింది. రాష్ట్రంలోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్ ) వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5.45 గంటలకు అప్పర్ సియాంగ్ జిల్లాలోని పాంగిన్ కు 116 కిలోమీటర్ల దూరంలో, భూమికి 11 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.అయితే, ప్రధాన భూకంపానికి ముందు ఆ ప్రాంతంలో వరుసగా మూడు సార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 3.40 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో 2.8 తీవ్రతతో మొదటి ప్రకంపన వచ్చింది. ఆ తర్వాత 3.55 గంటలకు 3.2 తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది. ఉదయం 4.34 గంటలకు 2.8 తీవ్రతతో మూడో ప్రకంపన నమోదైంది. వరుస భూకంపాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
షియోమి జిల్లాలోనూ భూప్రకంపనలు..
మరోవైపు ఇదే రాష్ట్రంలోని షియోమి జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేలుపై 5.0గా నమోదైంది. ఈ జిల్లా కేంద్రానికి ఈశాన్యంగా 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కాగా, దేశంలోని ఈశాన్య ప్రాంతం అత్యంత కీలకమైన భూకంప జోన్లో (సెయిస్మిక్ జోన్) ఉంది. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగానే ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.


