తార్నాక, (ప్రభంజనం): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్లో పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ జిల్లా, వడ్డే ఓబన్న ఉత్సవ కమిటీ సభ్యుడు గండికోట కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంచార్జ్ ఆదం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాణికేశ్వరి నగర్లోని ఆటో స్టాండ్ వద్ద గండికోట కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాణికేశ్వరి నగర్ కమాన్, ఎస్బీఐ ఏటీఎం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, స్ట్రీట్ నంబర్ 14 కమిటీ హాల్ వద్ద ఆదం సంతోష్ కుమార్ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో గండికోట కుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అదేవిధంగా మాణికేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి. దాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాణికేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైజర్స్, బాడీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకుని, దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


