మెదక్, (ప్రభంజనం) : ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తు అభివృద్ధికి జనాభా లెక్కలే అత్యంత కీలకమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. రానున్న జనగణన-2027 సన్నాహకాల్లో భాగంగా జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ తయారీపై గురువారం ఆమె కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి రంగం యొక్క సమగ్ర సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జనగణన ప్రక్రియలో మున్సిపల్, విద్య, వైద్య ఆరోగ్య, గృహనిర్మాణ, ఆర్ అండ్ బీ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల వారీగా జనాభా వివరాలు, మౌలిక వసతులు, పౌర సౌకర్యాల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. డిజిటల్ యాప్లు, వెబ్ పోర్టల్ల ద్వారా ఖచ్చితమైన డేటాను క్రోడీకరించాలని, రెవెన్యూ గ్రామాల స్థాయిలో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీవోలు రమాదేవి, రామకృష్ణ, బవయ్య, జిల్లాలోని తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


