హైదరాబాద్ క్రైమ్ బ్యూరో : తండ్రి అంత్యక్రియలు, ఇతర చావు ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. తమ్ముడు కత్తెరతో అన్నపై దాడి చేసి హతమార్చిన ఘటన మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి చంపాపేట్ కుమ్మరి బస్తీలో శనివారం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం.. ముదావత్ వెంకటేష్ (28) గత ఐదేళ్లుగా కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తండ్రి మృతి అనంతరం అతని తమ్ముడు శివ (26) కూడా అన్న వద్దకు వచ్చి అదే ప్రాంతంలో ఉంటున్నాడు.తండ్రి అంత్యక్రియలు, ఇతర చావు ఖర్చులను వెంకటేష్ భరించగా.. అందులో తన వాటా ఇవ్వలేదంటూ శివ తరచూ అన్నతో గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. ఈ విషయమై గతంలోనూ ఇద్దరి మధ్య పలుమార్లు వివాదాలు జరిగినట్లు తెలిసింది.ఈ క్రమంలో శనివారం చావు ఖర్చుల విషయమై మరోసారి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన శివ కత్తెరతో వెంకటేష్పై దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.తీవ్రంగా గాయపడిన వెంకటేష్ను కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


