Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeJeedimetla: కుత్బుల్లాపూర్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Jeedimetla: కుత్బుల్లాపూర్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

📰 Generate e-Paper Clip

  • 13 దుకాణాల చోరీ కేసులు ఛేదించిన జీడిమెట్ల పోలీసులు

మేడ్చల్ ( ప్రభంజనం ):  కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో రాత్రి వేళల్లో మూసివేసిన వాణిజ్య దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జీడిమెట్ల పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 13 చోరీ కేసులు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 5-6 మధ్య రాత్రి చింతల్ మెయిన్ రోడ్డులోని గణేష్‌నగర్‌లో ఉన్న ఐనత్ గ్లాస్ అండ్ ప్లైవుడ్ షాప్ లో చోరీ జరిగింది. మూసివేసిన దుకాణం షట్టర్‌ను పైకి లేపి లోపలికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌లో ఉంచిన రూ.80 వేల నగదును అపహరించారు. దీనిపై జీడిమెట్ల పోలీసులు క్రైమ్ నంబర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాంకేతిక, ఎలక్ట్రానిక్ ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారు రాజస్థాన్, గుజరాత్ వైపు పరారైనట్లు గుర్తించి ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలో హరి సింగ్ (30), చందన్ సింగ్ (28)లను, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో లుంబ్ సింగ్ (29), మనోహర్ సింగ్ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సంబంధిత కోర్టుల నుంచి ట్రాన్సిట్ వారెంట్లు పొంది నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

దొంగతనాలకు ప్రత్యేక పద్ధతి

పోలీసుల దర్యాప్తులో నిందితులు పరస్పరం పరిచయం ఉన్నవారిగా, ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో మూసివేసిన వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది. గండిమైసమ్మ, చింతల్, జీడిమెట్ల, నిజాంపేట్, దూలపల్లి, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో ముందుగా రెక్కీ నిర్వహించి, చోరీకి అనువైన దుకాణాలను గుర్తించేవారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రాత్రి సమయంలో అక్కడికి చేరుకుని షట్టర్లను పగులగొట్టడం లేదా పైకి లేపి లోపలికి ప్రవేశించేవారు. కొందరు దుకాణంలో చోరీ చేస్తుండగా, మరికొందరు బయట కాపలా ఉండేవారని పోలీసులు పేర్కొన్నారు. నగదు కౌంటర్లు, ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్, ప్లైవుడ్, కిరాణా, వస్త్ర దుకాణాలు తదితర వాణిజ్య సంస్థలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

13 కేసులు ఛేదన..

నిందితుల విచారణ, దర్యాప్తు ద్వారా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 13 కేసులను పోలీసులు ఛేదించారు.

  • బాచుపల్లి పోలీస్ స్టేషన్ – 3 కేసులు
  • దుండిగల్ పోలీస్ స్టేషన్ – 2 కేసులు
  • జీడిమెట్ల పోలీస్ స్టేషన్ – 2 కేసులు
  • పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ – 3 కేసులు
  • మియాపూర్ పోలీస్ స్టేషన్ – 1 కేసు
  • కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ – 1 కేసు
  • మేడ్చల్ పోలీస్ స్టేషన్ – 1 కేసులో వీరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును ఛేదించడంలో కూకట్‌పల్లి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, దుండిగల్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జి. రమేష్ నాయుడు, వారి బృందాలు కీలకంగా పనిచేశాయి. సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.