- కరెంట్ తీగలకు తగిలి గణపతి తలభాగం పూర్తిగా ధ్వంసం
- 20 మంది యువకులకు తప్పిన ప్రమాదం.. అప్రమత్తమైన పోలీసులు
ఆర్మూర్ (ప్రభంజనం): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శుక్రవారం దేవి ఆలయం వద్ద శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కోరుట్ల నుంచి కామారెడ్డికి తరలిస్తున్న భారీ గణపతి విగ్రహం విద్యుత్ స్తంభానికి ఉన్న తీగలకు తగలడంతో విగ్రహం తలభాగం పూర్తిగా తెగి కిందపడిపోయింది.
విగ్రహాన్ని తరలిస్తున్న వాహనంలో ఉన్న సుమారు 20 మంది యువకులకు పెను ప్రమాదం తప్పింది. ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టి రాకపోకలను క్లియర్ చేశారు.
భారీ విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ తీగలు, రహదారి పరిస్థితులను ముందుగానే పరిశీలించాలని స్థానికులు సూచిస్తున్నారు. మండపాల నిర్వాహకులు పెద్ద విగ్రహాలను తీసుకువచ్చే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, లేకపోతే యువకులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారీ విగ్రహాల తరలింపులో భద్రతా చర్యలపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.


