- శాసనసభ ముందు నేడు జరిగింది దుష్యాసన పర్వం
- నాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి పడుతుంది
- కాంగ్రెస్ ప్రజాపాలన కాదు-ప్రజావ్యతిరేక పాలన
- భారత రాజ్యాంగానికి, స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో గారడీలు-హామీలు గురించి అడిగితే అరెస్టులు
- మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా తోసి వేస్తారా
- తెలంగాణలోనే కాదు- శాసనసభలో కూడా రక్షణ లేదు
- కౌరవులకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది
- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి: ( ప్రభంజనం )
అసెంబ్లీ ప్రాంగణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్య కాండకు చొప్పదండిలో ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన మాజీ సుంకె రవిశంకర్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ వెయ్యి రోజుల అసమర్ధత పాలనపై, చొప్పదండి ఎమ్మార్వో ఆఫీస్ ప్రజావాణిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యంగా వ్యవహరించారనే ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ ఘటనలను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను అసెంబ్లీ గేటు వద్దే అరెస్టు చేయడం, మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తోసివేయడం ప్రజాపాలనా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా శాసనసభలోనూ రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై బీఆర్ఎస్ నిరంతరం ప్రశ్నలు సంధిస్తోందని, వెయ్యి రోజుల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందనే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. హామీలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం విమర్శలను అణచివేస్తోందని సుంకె రవిశంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.. ప్రజా పాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనగా మారిందని రవిశంకర్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హామీలను నెరవేర్చే వరకు రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. నాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్కు పడుతుంది అంటూ ఆ పార్టీ నాయకత్వాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు.


