- ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి
- కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య!
నల్గొండ: ( ప్రభంజనం )
వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాల నేపథ్యంలో ఓ బాలింత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన మమత (32 ) ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. మమతకు వారం రోజుల క్రితమే ప్రసవం జరిగింది. ఆమెకు వరుసగా నాలుగోసారి ఆడపిల్ల జన్మించడంతో కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. అత్తింటి వేధింపులే మమత ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మమత ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


